AP Chief Minister: తన చుట్టూ ఏం జరుగుతోందో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. నష్ట నివారణ చర్యలకు ఆయన ఉపక్రమించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్పై వేటు వేశారనే వార్తలు వినిపిస్తన్నాయి. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే వారికి ఏం జరుగుతుందో ఓ హెచ్చరిక ఈ విధంగా పంపినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
AP Chief Minister: అమరావతి: సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ను తప్పించడం రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రవీణ్ ప్రకాశ్ స్థానంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న ముత్యాలరాజును నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్ అంటే ఐఏఎస్ అధికారుల్లో గిట్టని వారే ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రవీణ్ ప్రకాశ్ దూకుడే ఆయనకు బలం, బలహీనత అని చెప్పవచ్చు.
ఈస్ట్గోదావరి, వైజాగ్, రంగారెడ్డి తదితర పెద్ద జిల్లాల కలెక్టర్గా ప్రవీణ్ ప్రకాశ్ పని చేసి సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కార్యాలయంలో సమర్థవంతగా అధికారులను నియమించుకోవాలని భావించారు. ఈ క్రమంలో తన జిల్లాకే చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి, అలాగే రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లం తదితరులపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే తానిచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న ధనుంజయ్ రెడ్డితో పాటు సలహాదారు అజయ్కల్లం కూడా తాత్సారం చేస్తూ వచ్చారని సమాచారం.
స్పీడ్ కాస్త చిక్కులు తెచ్చిందా?
దీంతో తన ఆదేశాలను అమలు చేయడంలో ఐఏఎస్ అధికారుల అలస్వతం జగన్కు చిరాకు తెప్పించింది. ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఆరు నెలల సమయం కూడా పట్టిన రోజులున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎంవోలోకి ప్రవీణ్ ప్రకాశ్ను రప్పించుకున్నారు. తాను ఆశించినట్టు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో ప్రవీణ్ ప్రకాశ్ చురుగ్గా పనిచేశారు, చేస్తు న్నారు.ఈ క్రమంలో ఆ స్పీడ్ జగన్ ఊహించిన దాని కంటే కాస్త ఎక్కువైంది. దీంతో కొత్త సమస్యలు తీసుకొచ్చింది. కొన్ని కీలక నిర్ణయాల్లో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయాలు తీసుకోక పోవడంతో పాటు కనీసం సీఎస్ కు కూడా సమాచారం లేకుండా ప్రవీణ్ అత్యుత్సాహం ప్రదర్శించాలని చెబుతున్నారు.
అదే ముఖ్యమంత్రికి కోపం తెప్పించింది. దీంతో కీలక పోస్టు నుంచి వెంటనే తప్పించడానికి దారి తీసిందనే అభిప్రాయాలు ఐఏఎస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల్ని, రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికశాఖకు మార్చే విషయంలో ప్రవీణ్ ప్రకాశ్ సొంత నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శుల అధికారాల్లో కోత విధించి, వాటిలో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ జీవో 2 జారీ చేయడం వివాదానికి దారి తీసింది. దీని వెనుక ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఈ జీవోను ఇటీవల హైకోర్టు సస్పెండ్ చేసింది.
గ్రూపు రాజకీయాలకు చెక్ పెడతారా?
ఇలా అంతర్గతంగా మరికొన్ని సంఘటనలకు సంబంధించి ప్రవీణ్ ప్రకాశ్పై సీఎంకు ఉన్నతాధికారుల నుంచి భారీగా ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాశ్తో ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు ఐఏఎస్ ఆఫీసర్లకు పొసగడం లేదు. ప్రవీణ్ కు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే కినుక మెజార్టీ ఐఏఎస్ ఆఫీసర్లలో ఉంది. ప్రవీణ్ దగ్గరికి వెళితే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇతర ఐఏఎస్ అధికారులపై కోపం, అలాగే వీళ్లను కలిస్తే ఆయనకు కోపం అన్నట్టుగా తయారైందని వైసీపీ నేతలు చర్చించు కుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపుతోనే ఆగుతుందా? మరికొంద రుపై వేటు వేసి ఉన్నతాధికారులు మధ్య గ్రూపు రాజకీయాలకు చెక్ పెడుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!