Nalgonda crime: road accident in Nalgonda district
Nalgonda: వారంతా రోజూ కష్టపడితే కాని పూట గడవని కూలీలు. అలాంటి కుటుంబాల్లో మృత్యువు తొంగి చూసింది. పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న కూలీల ఆటో..నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగిడిపేట వద్ద గొర్రెలు తీసుకెళుతున్న బొలెరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 9 మంది మృతి చెందారు. ఆటో డ్రైవర్ తో సహా మరో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో ఆరుగురు, హైదరాబాద్, దేవరకొండ లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. ఇంకా మరో 11 మందికి గాయాలు కాగా, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
మృతిచెందిన వారంతా చెన్నంపేట మండలంలోని సుద్దబావతండాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. గాయపడ్డవారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సుమారు 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదం జరిగిన తీరును క్షుణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతిచెందిన వారిలో…
1.ఆటోడ్రైవర్ మల్లేశ్ 2. డ్రైవర్ తల్లి పెద్దమ్మ 3. డ్రైవర్ భార్య చంద్రకళ 4. గొడుగు లింగమ్మ 5.నోముల సైదమ్మ 6.అంజమ్మ 7. ఇద్దమ్మ 8. నోముల అలివేలు 9. కొట్టం పెద్దమ్మ ఉన్నారు.
సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
పెద్ద అడిశర్లపల్లి మండలం అంగిడిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు