moral story: అది ఒక చిన్న గ్రామం. అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ ఇంజనీరు వచ్చాడు. తన పని పూర్తి చేసుకుని, రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి రెండు కొవ్వొత్తులు తీసి వెలిగించాడు.
ఆ తర్వాత లెక్కలు వ్రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి, మరో రెండు కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవ సాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా! ముందు వెలుగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవొచ్చు కదా! దాన్ని ఆర్పి వేరే దాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు.
అందుకు ఆ ఇంజనీరు, మొదల వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. దాని వెలుగులో ప్రభుత్వం పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు. ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. కానీ ఇతనెంత నిజాయతీగా ఉన్నాడని ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ ఆ ఇంజనీరు ఎవరో తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
moral story: ఇద్దరు అన్నాదమ్ముల కథ!
ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారు. ఒకడు తాగుబోతు. ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్లేవాడు. అందుకు నేనిలా తయారయ్యాను. అని అన్నాడు.
ప్రయోజకుడిని నువ్వు ఎందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్లేవాడు. అమ్మని కొట్టేవాడు. ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేనిలా తయారయ్యాను అని అన్నాడు. ఇక్కడ కథలో ఇద్దరిదీ ఒకే పరిస్థితి. కానీ ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది. తేడా పాఠంలో లేదు. నేర్చుకున్నవాడిలో ఉంది.