CM YS Jaganmohan Reddy participating in the Gopuja | కామధేను పూజలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిGuntur: కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట లో శుక్రవారం నిర్వహించిన కామధేను పూజ (గోపూజ)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి పాల్గొన్నారు. పంచకట్టు, కండువాతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ప్రాంగణంలో ఉన్న గోమాతలు, నందీశ్వరులు(ఎద్దు) అలంకరణలు చూశారు.
అనంతరం గో పూజకు గోత్ర నామాలతో ఆయన సంకల్పం చేసుకున్నారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ జగన్మోహన్ రెడ్డి గోమాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. గోమాత, దూడకు ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించారు. టిటిడి అర్చకులు సీఎంను శేష వస్త్రంతో సత్కరించారు. ఇస్కాన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రిని గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. గోపూజ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కామధేను పూజ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహార్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, జెఈఓ పి బసంత్ కుమార్, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్, ఎస్పీ విశాల్ గున్నీ, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవదాయ శాఖ సహకారంతో టిటిడి ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో 2,679 ఆలయాల్లో ఉదయం 11.50 గంటలకు శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇది చదవండి: స్టోరీ: సాగర్ ఉప ఎన్నిక పై గురి?