Lockdown : తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే విధంగా ప్రతి ఇంటికీ కోవిడ్ కిట్ అందిస్తున్నట్టు తెలిపారు.
Lockdown : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్(Lockdown) విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వల్ల ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించామని సీఎం వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ , రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడీ తో ఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించామన్నారు. తమిళనాడులో శ్రీ పెరంబదూరు నుంచి కర్ణాటక లోని బళ్ళారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. మెడికల్ హబ్గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ వైద్య సేవలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు.
హైదరాబాద్ వైద్యం కోసం వస్తున్న బాధితులు
ఇక మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి హైదారాబాద్ కు కోవిడ్ చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందని హైదరాబాద్ మీద భారం పెరిగిందని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి రావడం వల్ల హైదరాబాద్ మీద ఆక్సిజన్(oxygen), వాక్సిన్(vaccine), రెమిడిసివర్(remdesivir) వంటి వసతుల లభ్యత మీద ప్రభావం పడుతుందని ప్రధానికి తెలిపామన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరామన్నారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరామన్నారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని మోడీని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సీఎం కేసీఆర్తో మాట్లాడారని, సత్వరమే రాష్ట్రానికి సమకూరుస్తామని, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడిసివర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ హామీ ఇచ్చారన్నారు. ఆక్సిజన్ను కర్ణాటక, తమిళనాడుల నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.
రాష్ట్ర పరిస్థితులపై ఆరా!


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నెలకొన్ని కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్ అందుతున్నది ఇంకా ఎంతకావాలి? వాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో ఉన్నవి? రోజుకు ఎంత అవసరం? రెమిడిసివర్ మందు ఏ మేరకు సప్లయ్ జరుగుతున్నది రాష్ట్రం అవసరాలకు రోజుకు ఎన్ని అవసరం? బెడ్ల లభ్యతపై ఉన్నతాధికారులను ఆరా తీశారు. రెమిడిసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సీఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9500 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయని, వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరో వారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలని సూచించారు. మెరుగైన ఆక్సిజన్ సరఫరా కోసం ఒక్కొక్కటి కోటి రూపాయలు చొప్పున 12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్కు సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చర్యలను అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
సెకండ్ వేవ్(Second wave)పై సీఎంకు వివరణ!
రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి లక్షా 56000 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో లక్షా 30000 (85 శాతం) కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సీఎం తెలిపారు. అందుకు సంబంధించి పాజిటివ్ కేసుల వివరాలు, కోలుకున్న వారి వివరాలు, హోం క్వారంటైన్లో ఎంత మంది ఉన్నారో వారి వివరాలు, ప్రైవేటు దవాఖానాల్లో ఎంత మంది ఉన్నారో వారి వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాల్లో పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారి చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని తెలిపారు.
ఇంటికే కోవిడ్ మెడికల కిట్లు(covid medical kit) పంపిణీ


కరోనా కేసుల విషయంలో ప్రజలు భయాందోళన చెంద వద్దని సీఎం సూచించారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టులు కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎంల ద్వారా ఇంటింటికీ అందజేస్తాన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు. ప్రగతి భవన్లో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంఓ కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!