Business in New changes coming in 2021| 2021లో నూతన మార్పులు ఇవే! 2020 సంవత్సరంలో కరోనా కారణంగా సగటు మనిషి జీవితంలో అనుకోని మార్పులు, చేర్పులు జీవన శైలిలో చేరాయి. విద్య, ఉపాధితో పాటు కుటుంబ బాంధ్యవాలలో చోటుచేసుకున్న మార్పుల ప్రస్తుతం అలానే కొనసాగుతున్నాయి. అయితే 2021 నూతన సంవత్సరంలో కూడా కొత్త మార్పులు వస్తున్నాయట. ఇందులో వాహనాలకు సంబంధించినవి కొన్ని కాగా, బ్యాకింగ్, టెలికాం రంగాలకు చెందిన కొన్ని ఉన్నాయట.
FASTag tollతో మరింత వేగం
2021 జనవరి 1 నుంచి దేశంలోని అన్ని వాహనాలకు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మినహా) కేంద్రం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ ద్వారా వాహన ప్రయాణికులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చని, నగదు చెల్లింపుల కోసం టోల్ ఫ్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి గడ్కారీ తెలిపారు. 2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త థర్డ్ పార్టీ వాహన బీమా పొందేందుకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్కు సంబంధించిన సహాయం కోసం 1033 నెంబర్ను సంప్రదించొచ్చు.


Contactless card ఇకపై రూ.5 వేలు
కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా ఇప్పటి వరకు రూ.2000 వేలు మాత్రమే పిన్ ఎంటర్ చేయకుండా పేమెంట్ చేసే వీలుంది. కానీ కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి మీ కాంటాక్ట్ లెస్ కార్డు ఉపయోగించి రూ.5000 వేల వరకు లావాదేవీలు జరపొచ్చని ఆర్బీఐ తెలిపింది. ఎన్ఎఫ్సీ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. నగదు పరిమితిని తగ్గించడం గానీ, పూర్తిగా జరగకుండా నిలిపివేయడం ఖాతాదారుని ఇష్టంకు వదిలేశారు.
Positive pay system విధానం
చెక్కులకు సంబంధించిన మోసాలను నివారించే లక్ష్యంతో పాజిటివ్ పే విధానాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ విధానం జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు చెక్, దానిపై ఖాతాదారుని సంతకం ఉంటే చెక్ మంజూరు జరిగేది. తాజా విధానం వల్ల రూ.50,000 వేలు అంతకంటే ఎక్కువ మొత్తంలో జారీ చేసిన చెక్కులను పునః సమీక్షించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని బ్యాంకులు అమలు చేయొచ్చు. వినియోగదారుని ఇష్టం మేరకు వదిలేయొచ్చు. అయితే రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం కలిగిన చెక్కులను మాత్రం పునః సమీక్ష తప్పనిసరి చేసింది ఆర్బిఐ. దీని ప్రకారం చెక్కు జారీ చేసే వ్యక్తి ఎలక్ట్రానిక్ పద్దతిలో (ఎస్ఎంఎస్, మొబైల్యాప్, ఇంటర్నెట్ బ్యాకింగ్,ఏటిఎం) చెక్కు వివరాలను బ్యాంకుకు తెలియపరచాల్సి ఉంటుంది. ఆ వివరాలను బ్యాంకు పరిశీలిస్తుంది. దీని వల్ల మోసపూరిత లావాదేవీలకు ఆస్కారం ఉండబోదని ఆర్బీఐ తెలిపింది.
Whatapp not working
కొత్త ఏడాది మొదటి రోజు నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పనిచేయదు. ఐఫోన్లలో ఐవోఎస్ 9, ఆండ్రాయడ్ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా ముందువి(పాతవి) ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్ తన సేవలను నిలిపివేయనుంది. ఐవోఎస్ 9 అంటే ఐఫోన్ 4 దానికన్నా ముందు వచ్చిన మోడళ్ల ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఒక వేళ మీరు వాడేది మరీ పాత ఫోన్ అయితే సెట్టింగ్స్ లోకి వెళ్లి ఓ సారి వెర్షన్ ను తనిఖీ చేసుకోండి.
కొనుగోలు ‘భారం’
నూతన సంవత్సరం కొత్త బైక్ లేదా కారు కొనుక్కోవాలనుకునేవారికి వాహన కంపెనీలు షాక్ ఇచ్చాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అందుకే జనవరి 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నామని పలు వాహన తయారీ కంపెనీలు ప్రకటించాయి. ప్రముఖ కార్ల కంపెనీలైన మారుతీ సుజుకీ, ఎంజీ మోటర్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా , రెనోతో పాటు హీరో మోటోకార్ఫ్ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. ఫ్రిజ్, టివి, వాషింగ్ మెషీన్ల ధరలు పెరగనున్నాయి.
చిన్నవ్యాపారులకు ఊరట
చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ 42వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు జనవరి 1 నుంచి త్రైమాసికానికోసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది. ఇకపై నెలకోసారి రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల సుమారు 94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
ల్యాండ్ లో ‘సున్నా’ తప్పనిసరి
ఇకపై ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు చేయబోయే కాల్స్కు కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ ‘0’ ను తప్పనిసరి చేసింది. జనవరి 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తగినన్ని సంఖ్యా వనరుల సృష్టికి ట్రాయ్ సిఫార్సుల మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మొబైల్ నుంచి మొబైల్కు, ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్ లైన్ కు , మొబైల్ నుంచి ల్యాండ్ లైన్ కు చేసే కాల్స్ లో ఎలాంటి మార్పులూ ఉంబోవు.