ఆస్తిపత్రాలు తీసుకుని తిరిగివ్వకుండా వేధిస్తున్న వైనం
లక్షలు దండుకున్న కేటుగాళ్లు
కృష్ణలంక పోలీసుస్టేషన్లో కేసు నమోదు
Bank loan fraud :Vijayawada: విజయవాడ నగరంలోని ఓ కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకున్న ఓ యువరైతును వైట్ కాలర్ నేరగాళ్లు నిలువునా మోసం చేసిన విషయం బయటపడింది. ఓ ప్రతిష్టాత్మక బ్యాంకు నుండి వ్యవసాయ రుణం మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికి లక్షలు దండుకున్నారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఇన్సూరెన్స్ ఛార్జీలు వగైరాతో పాటు కమీషన్ల పేరుతో దాదాపు రూ.5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. తీరా ఈ మోసం(Bank loan fraud) కొంచెం కొంచెం తెలుసుకున్న బాధిత యువ రైతు మీ లోన్ నాకు వద్దు మహా ప్రభో..నేను ఇచ్చిన డబ్బులు, ఆస్తిపత్రాలు నాకు తిరిగిచ్చేయండని వేడుకున్న బాధితుడికి చుక్కలు చూపించారు. నీ లోన్ హోల్డ్ లో ఉంది. ఇప్పుడు వద్దంటే నువ్విచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా వెనక్కురాదు. నీ ఆస్తిపత్రాలు నీకివ్వాలంటే మరో రూ.2 లక్షలు ఇవ్వాలని బుకాయిస్తూ వేధింపులకు దిగారు.
వివరాల్లోకి వెళితే సురేష్ కుమార్ అనే యువ రైతు తనకున్న భూమిలో అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. సురేష్ కు ఉన్న మంచితనం, అకింతభావంతో పాటు వ్యవసాయం పట్ల అతనికున్న ప్రేమను గుర్తించిన కొందరు రైతులు తమ భూములను సైతం సురేష్కు కౌలుకు ఇచ్చారు. ఈ క్రమంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి, ఆదర్శ రైతుగా నిలవాలనుకున్నాడు సురేష్. ఇందుకు అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలనుకున్నాడు.
లోన్ ఇప్పిస్తామంటూ నమ్మించి..
వ్యవసాయ రుణం కోసం ప్రయత్నిస్తున్న సురేష్ను హెచ్డిఎఫ్సి(HDFC) బ్యాంకు ప్రతినిధులమంటూ కొందరు వ్యక్తులు సంప్రదించారు. యువ వ్వయసాయదారులను ప్రోత్సహించడానికి తమ బ్యాంకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని, సదరు స్పెషల్ లోన్ ప్రోగ్రాంలో భాగంగా అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని నమ్మబలికారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన హెచ్డిఎఫ్సి బ్యాంకు నుండి లోన్ మంజూరైతే అంతకన్నా కావాల్సిందేముందన్న సురేష్ కుమార్, రూ.4 కోట్ల వ్యవసాయ రుణానికి దరఖాస్తు చేశాడు.
రూ.5 లక్షలు దండుకున్న కేటుగాళ్లు!
లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఫార్మాలిటీల పేరుతో రూ.5 లక్షలు దండుకున్న మోసగాళ్లు, ఆస్తుల పరిశీలన, హామీదారుల నుండి సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాలతో కొద్దిరోజులు హడావుడి చేశారు. దాదాపు మూడు నెలల అనంతరం మీకు కోటి రూపాయల లోన్ మాత్రమే మంజూరయ్యింది. అంతకంటే ఎక్కువ మొత్తం కావాలంటే 5% ఫార్మాలిటీ ఫీజు ఇవ్వాల్సిఉంటుందని చెప్పుకొచ్చారు. కోటి రూపాయలే కావాలనుకుంటే తెల్లకాగితంపై సంతకం చేసివ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో అనుమానం వచ్చిన సురేష్ కుమార్ నాకు లోన్ అవసరం లేదు. నేనిచ్చిన డబ్బులు, నా ఆస్తిపత్రాలు తిరిగి ఇచ్చేయాలని తేల్చిచెప్పాడు.
కథ అడ్డం తిరగడంతో..!
కేటుగాళ్లు అనుకున్న ప్లాన్ కథ అడ్డం తిరగడంతో లోన్ వద్దంటే కట్టిన డబ్బులో ఒక్కరూపాయి కూడా తిరిగిరాదని, ఆస్తిపత్రాలు తిరిగివ్వాలంటే రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుందని మోసగాళ్లు బెదిరింపులకు దిగారు. తన అబ్లికేషన్ గురించి తెలుసుకునేందుకు బందరు రోడ్డులోని హెచ్డిఎఫ్సి బ్యాంకు కు వెళ్లిన సురేష్ కుమార్, అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానంతో షాక్కు గురయ్యాడు. మీరు చెప్తున్న అగ్రికల్చర్ లోన్ విభాగం వాళ్లెవ్వరూ ఇక్కడ లేరని బ్యాంకు సిబ్బంది వివరంగా చెప్పారు. దీంతో మోస పోయినట్టు గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
అగ్రికల్చర్ లోన్ పేరుతో సురేష్ కుమార్కు మస్కా కొట్టిన మోసగాళ్ల వలలో మరింత మంది చిక్కుకుని నిలువు దోపిడీకి గురైనట్టు సమాచారం. లోన్ ప్రాసెసింగ్ పేరుతో దొరికినంత దోచుకోవడం, దరఖాస్తుదారుడికి విసుగొచ్చి వదిలేసేంత వరకు తిప్పించుకోవడం సదురు కేటుగాళ్ల ముఠా ఆరితేరినట్టుగా తెలుస్తోంది.
పరారీలో నిందితులు!
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కృష్ణలంక పోలీసులు వెల్లడించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు అగ్రి లోన్స్ విభాగానికి చెందిన శ్రీనివాస చక్రవర్తి, సుధాకర్లతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మోసం వెలుగులోకి రావడంతో కేసు నుండి బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు నిందితులు. చివరకు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి: విక్టరీ ఆధ్వర్యంలో రాబోతున్న దృశ్యం 2
ఇది చదవండి:మయన్మార్ లో ఆగని నిరసనలు! నిర్భంధంలోనే సూచీ!
ఇది చదవండి:ముఖానికి కవర్తో నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
ఇది చదవండి: రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!