“నేనే వికాస్ దూబే..కాన్పూర్ వాలా..” అంటూ పోలీసుల ముందు విర్రవీగిన వికాస్ దూబే అరెస్టు అనంతరం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత శుక్రవారం 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్ దూబే వారం తిరగక ముందే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గురువారం మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ నగరంలో పట్టుబడ్డ వికాన్సు శుక్రవారం ఉదయం ఉత్తర్ప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్సు పోలీసులు కాన్పూర్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో కాన్వాయ్లోని ఓ వాహనం బోల్తాపడింది. దీన్ని అదునుగా భావించిన అతడు ఓ పోలీసు తుపాకీని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. లొంగిపో వాలన్న పోలీసుల ఆదేశాల్ని బేఖాతరు చేశాడు. పై గా పోలీసులపైకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెం దినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ కేసులో దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్ అలియాస్ బౌవా దూబే గురువారం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు.
ఉత్తరప్రదేశ్: అరెస్టుకు ముందు వికాస్దూబే పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. బిక్రులో పోలీసుల్ని బలితీసుకున్న ఘటన తర్వాత కన్పూర్ నుంచి రాజస్థాన్లోని కోట మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హరియాణలోని ఫరీదాబాద్ చేరుకున్నాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఆతర్వాత ఉజ్జయిన్ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్ చేరుకున్నాడు.
పోలీసులే టచ్లో ఉన్నారు?
“8 మంది పోలీసులను హతమార్చిన అనంతరం మృతదేహాలను తగలబెట్టాలని నిర్ణయించాం. దీంతో ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా చేయాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉండగానే మరో పోలీసు బృందం అక్కడికి చేరుకుందని. అందుకే వారిని సమీపంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాం.” అని అధికారులకు వికాస్ దూబే వివరించినట్టు సమాచారం. తనను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం వస్తోన్న సమాచారం స్థానిక చౌబేపూర్ పోలీసుల నుంచే వచ్చినట్టు వికాస్ దూబే విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, మరుసటి రోజు ఉదయం వస్తారనే సమాచారం ఉందని, కానీ, పోలీసులు రాత్రే రావడంతో భయంతో వారిపై కాల్పులు జరిపినట్టు విచారణలో వివరించాడు. అంతేకాకుండా, స్థానిక పోలీసులందరికీ ఎన్నో విధాలుగా సాయం చేశానని, దాదాపు వారందర్నీ నేనే పోషించానని తెలపడం గమనర్హం. చౌబేపూర్ పోలీసులతో పాటు మరికొన్ని స్టేషన్ల సిబ్బందికి ఎంతోగానే సాయం చేసినట్టు విచారణలో వెల్లడించాడని సమాచారం.
మహంకాళి ఆలయంలోకి ప్రవేశం..!
8 మంది పోలీసులను హతమార్చిన అనంతరం పోలీసులకు చిక్కకుండా ఐదు రోజులు తప్పించుకుతిరిగిన వికాస్ దూబే ఉజ్జయిన్లోని మహంకాళి ఆలయం వద్ద పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఏకంగా వీఐపీ పాస్తోనే ఆలయంలో దర్శనం చేసుకున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. దీంతో మరోసారి విస్తుపోయిన పోలీసులు అతనికి సహకరించిన వారి కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం డీలర్తో పాటు మరికొందరు నాయకులు కూడా అతనికి సహకరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వికాస్ దూబే ఎన్కౌంటర్ అనంతరం ఆయన తల్లి స్పందిస్తూ..”నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఏది సరైనదో ప్రభుత్వం అదే చేస్తుంది.”అతని తల్లి స్పదించారు. ఇక అరెస్టు వార్త విన్న వెంటనే ఎన్కౌంటర్లో చనిపోయిన పోలీసు కుటుంబాలు స్పందిస్తూ ..8 మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న కిరాతకుడ్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వికాస్ దూబేపై క్రిమినెల్ కేసులే కాదు..ఇతర కేసులు కూడా చాలా ఉన్నాయి . రాజకీయ పార్టీల్లో అతడికి చాలా పలుకుబడి ఉందని కాన్పూర్ ఐజీ మోహిత్ అగ్రవాల్ బీబీసీ ఛానల్కు చెప్పారు. కాన్పూర్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో దూబేపై 60 కేసుల వరకూ ఉన్నాయిని, వాటిలో హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మూడు దశాబ్ధాలుగా నేర ప్రపంచంలో వికాస్దూబే పేరు వినిపిస్తున్నట్టు తెలిపారు. అతడిని పలుమార్లు అరెస్టు కూడా చేసినప్పటికీ ఇప్పటి వరకూ అతడికి ఏ కేసులోనూ శిక్ష వేయించలేకపోయారని పేర్కొన్నారు.
2001లో ఒక పోలీస్ స్టేషన్లో కి చొరబడి సహాయ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నేత సంతోష్ శుక్లాను హత్య చేశాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శుక్లా హత్య ఒక హైప్రొఫైల్ కేసు. అంత పెద్ద నేరం జరిగినా పోలీసులెవ్వరూ వికాస్ దూబేకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకపోవడం గమనర్హం. దీంతో కోర్టులో ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోవడంతో అతడిని వదిలేశారు. అని కాన్పూర్ స్థానిక జర్నలిస్ట్ ప్రవీణ్ మెహతా పేర్కొన్నారు. 2000 లో కాన్పూర్ శివాలీ పోలీస్స్టేషన్ లో ఉన్న తారాచంద్ ఇందర్ కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో కూడా వికాస్ దూబే పేరు ఉంది. వికాస్ దూబే అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా సన్నిహితంగా ఉండేవాడు. 2004లో ఒక కేబుల్ వ్యాపారి హత్యలో, 2013లో ఒక హత్య కేసులో 2018లో తన చిన్నాన్న కొడుకు అనురాగ్ పై హత్యాయత్నం కేసులో వికాస్దూబే హస్తం ఉన్నట్టు అతనిపై కేసులు నడుస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వికాస్ దూబే స్వస్థలం కాన్పూర్ బిటూర్ ప్రాంతంలోని బికరూ గ్రామం. ఆ గ్రామంలో అతడు తన ఇంటిని ఒక కోటలా నిర్మించుకున్నాడు. అతడి అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లలేరని స్థానికులు చెబుతున్నారు. 2002లో రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వికాస్ హవా కొనసాగింది. అప్పట్లో నేర సామ్రాజ్యంలో అతడి ఆధిపత్యం కొనసాగడమే కాదు, భారీగా డబ్బు కూడా సంపాదించాడు. అని ఓ గ్రామస్థుడు బీబీసీ చానల్కు తెలిపాడు. చౌబేపూర్లో నమోదైన కేసుల్లో అక్రమంగా జరిగిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఆ లావాదేవీల వల్లే వికాస్ దూబే అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆయనకు సంబంధిచిన కొన్ని స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. బికరూ గ్రామంలో గత 15 ఏళ్ల నుంచీ ఒకే వ్యక్తీ ఏకగ్రీవంగా సర్పంచి అవుతూ వస్తున్నారు. వికాస్ దూబే కుటుంబ సభ్యుల్లో కొందరు గత 15 ఏళ్లుగా జిల్లా పంచాయతీ సభ్యులుగా గెలుస్తున్నారు అని ఆ గ్రామానికి చెందిన వృద్ధుడు తెలిపాడు.
వ్యవసాయ కుటుంబ నుంచి గ్యాంగ్ స్టార్ స్థాయికి..!
వికాస్ దూబే తండ్రి ఒక రైతు. వికాస్కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒక సోదరుడు 8 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. ముగ్గురిలో వికాస్ దూబే చిన్నవాడు. వికాస్ భార్య రిచా దూబే ప్రస్తుతం జిల్లా పంచాయతీ సభ్యులుగా ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. 2000 సంవత్సరంలో శివాలీలో అప్పటి నగర పంచాయతీ ఛైర్మన్ లల్లన్వాజ్పేయితో గొడవలు తర్వాత వికాస్ దూబే నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టు చెబుతున్నారు. వికాస్ దూబేకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతుంటే, ఇంకొకరు కాన్పూర్ సిటీలోనే చదువుకుంటున్నాడు.